
Photo Courtesy: BCCI
పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో మూడు ఫోర్లు బాదిన విరాట్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ఐపీఎల్లో శిఖర్ 768 బౌండరీలు బాదగా.. విరాట్ ఈ మ్యాచ్లో ఆ మార్కును క్రాస్ చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 770 బౌండరీలు ఉన్నాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన టాప్-5 ఆటగాళ్లు..
విరాట్ కోహ్లి- 770 (267 ఇన్నింగ్స్లు)
శిఖర్ ధవన్-768 (222)
డేవిడ్ వార్నర్-663 (184)
రోహిత్ శర్మ-640 (272)
అజింక్య రహానే-514 (172)
భారీ రికార్డును మిస్ చేసుకున్న విరాట్
ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డు సొంతం చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ 86 పరుగులు చేసుంటే, ఐపీఎల్ చరిత్రలో మూడు సీజన్లలో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించేవాడు. అయితే విరాట్ 43 పరుగులకే ఔట్ కావడంతో ఈ సీజన్లో అతని పరుగుల సంఖ్య 657 పరుగుల వద్ద ఆగిపోయింది. విరాట్ 2016 సీజన్లో 973 పరుగులు, 2024 సీజన్లో 741 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్తో పాటు క్రిస్ గేల్ ఒక్కడే రెండు సీజన్లలో 700 పరుగుల మార్కును తాకిన ఆటగాడిగా ఉన్నాడు. గేల్ వరుసగా 2012, 2013 సీజన్లలో ఈ ఘనత సాధించాడు.
ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 16, జితేశ్ శర్మ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. సాల్ట్ 16, విరాట్ కోహ్లి 43, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్ 2, ఒమర్జాయ్, చహల్ తలో వికెట్ తీశారు.