IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్‌కే..? | IPL 2025: CSK Call Urvil Patel For Mid Season Trials Says Report | Sakshi
Sakshi News home page

IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్‌కే..?

May 1 2025 7:03 PM | Updated on May 1 2025 7:20 PM

IPL 2025: CSK Call Urvil Patel For Mid Season Trials Says Report

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కథ ముగిసింది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్‌లో సీఎస్‌కే వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరకుండా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. ఏ జట్టు ఓడని విధంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది.

సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తర్వాత ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం సీఎస్‌కే యాజమాన్యం ఓ విధ్వంసకర వీరుడిని ట్రయల్స్‌కు పిలిచినట్లు సమాచారం. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ గుజరాత్‌కు చెందిన ఉర్విల్‌ పటేల్‌ను మిడ్‌ సీజన్‌ ట్రయల్స్‌కు పిలిచినట్లు ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు.

ఉర్విల్‌ గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో (టీ20) 28 బంతుల్లోనే (త్రిపురపై) సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. పొట్టి క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును ఎస్టోనియాకు చెందిన సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఉంది. సాహిత్‌ గతేడాది సైప్రస్‌పై 27 బంతుల్లోనే శతకొట్టాడు.

26 ఏళ్ల ఉర్విల్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌. ఇతనికి దేశవాలీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 10 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 అర్ద సెంచరీలు.. 22 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు.. 47 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

ఉర్విల్‌ను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ తదుపరి సీజన్‌ ప్రణాళికల్లో భాగంగా ట్రయల్స్‌కు పిలిచినట్లు తెలుస్తుంది. ధోని వచ్చే సీజన్‌లో రిటైర్‌ అవుతాడని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఉర్విల్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు (30 లక్షల విభాగంలో). అయినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. సీఎస్‌కేకు ఉర్విల్‌పై ముందు నుంచే కన్ను ఉన్నప్పటికీ ఎందుకో అతన్ని రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఎంపిక చేసుకోలేదు. రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఆయుశ్‌ మాత్రే సీఎస్‌కేలోకి వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, సీఎస్‌కే నిన్న (ఏప్రిల్‌ 30) పంజాబ్‌ చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు అధికారికంగా గల్లంతయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే తొలుత భారీ స్కోర్‌ చేసేలా కనిపించినా.. ఆఖర్లో చహల్‌ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో 190 పరుగులకే ఆలౌటైంది. 

అనంతరం పంజాబ్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement