మెరిసిన షఫాలీ: భారత్‌దే టి20 సిరీస్‌ | Sakshi
Sakshi News home page

మెరిసిన షఫాలీ: భారత్‌దే టి20 సిరీస్‌

Published Fri, May 3 2024 4:24 AM

Indian womens team third win in a row

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే టి20 సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ దిలారా అక్తర్‌ (27  బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్‌ నిగర్‌ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్‌) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. 

ఓపెనర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది.  

Advertisement
Advertisement