
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో మధుర ధమాంగావ్కర్ (మహారాష్ట్ర), తనిపర్తి చికిత (తెలంగాణ), వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. కజకిస్తాన్, బ్రిటన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో భారత్ తలపడుతుంది.
క్వాలిఫయింగ్లో భారత జట్టు ఓవరాల్గా 1777 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. మధుర 600 పాయింట్లతో నాలుగో స్థానంలో, చికిత 592 పాయింట్లతో 11వ స్థానంలో, జ్యోతి సురేఖ 585 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచారు.
పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 572 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్కే చెందిన అతాను దాస్ 570 పాయింట్లతో 17వ స్థానంలో, పార్థ్ సాలుంఖే 565 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా భారత్ 1707 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి రెండో రౌండ్కు అర్హత పొందింది.