రోటర్డామ్ (నెదర్లాండ్స్): పురుషుల ప్రొ హాకీ లీగ్లో భారత జట్టు రెగ్యులర్ సమయంలో తొలి విజయం అందుకుంది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 3–1తో సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (7వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (13వ నిమిషంలో), నీలకంఠ శర్మ (35వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా మాజీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు (413) ఆడిన హాకీ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.
412 మ్యాచ్లతో దిలీప్ టిర్కీ పేరిట ఉన్న రికార్డును మన్ప్రీత్ బద్దలు కొట్టాడు. తొమ్మిది జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ పది మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సమయంలో ఒక విజయం (3 పాయింట్లు), ‘షూటౌట్’లో ఒక విజయం (2 పాయింట్లు) సాధించింది. ‘షూటౌట్’ లో రెండు పరాజయాలు (ఒక్కో పాయింట్), రెగ్యులర్ మ్యాచ్లో ఆరు ఓటములు చవిచూసి ఏడు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.


