ఆక్లాండ్: మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో సలీమా టెటె బృందం 3–2 గోల్స్ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్ తరఫున దీపిక రెండు గోల్స్ (24వ, 56వ నిమిషాల్లో) చేయగా... దీపిక సోరెంగ్ (43వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.
ఉరుగ్వే తరఫున చియారా అపెనినో (13వ నిమిషంలో), మాన్యుయెలా విలార్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా భారత ప్లేయర్ నేహా కెరీర్లో 200 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ‘హ్యాట్రిక్’ విజయం సాధించిన భారత జట్టు తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో చిలీ జట్టుతో భారత్ తలపడుతుంది.


