రేపే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ | India Women Vs Pakistan Women T20 World Cup 2026 Blockbuster Match Sparks Massive Buzz, Check Out Head To Head Records | Sakshi
Sakshi News home page

T20 World Cup2026: రేపే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌

Jun 13 2026 1:54 PM | Updated on Jun 13 2026 3:26 PM

India Women vs Pakistan Women: T20 World Cup Head-to-Head Record

క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యంత హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.  రాజకీయ కారణాల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలతో పాటు ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.

దీంతో చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడు తలపడతారా? ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని అద్భుతమైన ఫామ్‌లో ఉన్న  హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. అదే జోరుతో ఈ టీ20 ప్రపంచ కప్‌లోనూ బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్లు బలాబాలాలపై ఓ లుక్కేద్దాం.

డేంజరస్‌ బ్యాటింగ్‌ లైనప్‌
దాయాది పాకిస్తాన్‌తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్,  హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌లతో టాప్, మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. 

భారతి ఫుల్మాలి వంటి ఫినిషర్‌ కూడా ఉండడం జట్టుకు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఈ టోర్నీకి ముందు జరిగిన వార్మాప్‌ మ్యాచ్‌లలో ఫుల్మాలి దుమ్ములేపింది. అంతేకాకుండా అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది.

బ్యాటింగ్‌ పరంగా భారత్‌ బలంగా ఉన్నప్పటికి బౌలింగ్‌లో మాత్రం కాస్త బలహీనంగా ఉందనే చెప్పాలి. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. వార్మాప్‌ మ్యాచ్‌లలో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కానీ ప్రధాన టోర్నీలో మాత్రం తమ బౌలర్లు మెరుగ్గా రాణిస్తారని భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ధీమా వ్యక్తం చేసింది.

మరోవైపు జట్టులోని నలుగురు ఆటగాళ్లు (భారతి ఫుల్మాలి, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్) మొదటిసారిగా టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో ఆడుతున్నారు. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో అద్భుతంగా రాణించినప్పటికి, ప్రపంచకప్‌ వంటి ఈవెంట్‌లో ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణిస్తారో వేచి చూడాలి.  

శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిల త్రయంతో పాటు దీప్తి శర్మ వంటి అద్బుతమైన స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరు మాత్రం బంతిని తిప్పితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు.  పేస్‌ బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌తో పాటు నందని శర్మ, అరుంధతి రెడ్డి యువ పేసర్లు ఉన్నారు.

ఫామ్‌లో లేని పాక్‌
పాకిస్తాన్‌ మహిళల జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ టోర్నీకి ముందు ఐర్లాండ్‌ వేదికగా జరిగిన ట్రైసిరీస్‌లో పాక్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వార్మాప్‌ మ్యాచ్‌లు రెండింటిలోనూ ఉమెన్‌ ఇన్‌ గ్రీన్‌ ఓటమి పాలైంది. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన భారత్‌తో తలపడనుంది. ప్రస్తుతం పరిస్థితుల బట్టి చూస్తే భారత్‌ చేతిలో పాక్‌కు మరో ఓటమి ఖాయమన్పిస్తోంది.

పాక్‌ జట్టులో ఓపెనర్లు మునీబా ఆలీ, గుల్ ఫెరోజా, కెప్టెన్‌ ఫాతిమా సనా మినహా మిగితా ప్లేయర్లు ఎవరు ఫామ్‌లో లేరు. బౌలింగ్‌ విభాగంలో డయానా బేగ్, నష్రా సంధు, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నప్పటికి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.

భారత్‌దే పై చేయి
మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్‌ 16 మ్యాచ్‌లు విజయం సాధించగా.. పాక్‌ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement