టీమిండియా జాక్‌పాట్‌.. పాపం పాకిస్థాన్‌! | India win INR 12 32 crore from ICC despite not qualifying for WTC final | Sakshi
Sakshi News home page

WTC Final 2025: టీమిండియా జాక్‌పాట్‌.. పాపం పాకిస్థాన్‌!

Jun 10 2025 5:48 PM | Updated on Jun 10 2025 6:01 PM

India win INR 12 32 crore from ICC despite not qualifying for WTC final

ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) విజేత ఎవ‌రో తేలిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో బుధ‌వారం నుంచి డ‌బ్ల్యూటీసీ ఫైనల్ జ‌ర‌గ‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా టైటిల్ కోసం బ‌రిలోకి దిగ‌నున్నాయి. గ‌త రెండు ఎడిష‌న్లతో పోలిస్తే ఈసారి విజేత‌కు రెండింత‌ల ఎక్కువ‌ ప్రైజ్‌మ‌నీ ద‌క్కుతుంది. టెస్ట్ క్రికెట్‌కు పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు ప్రైజ్‌మ‌నీని భారీగా పెంచింది ఐసీసీ.

డ‌బ్ల్యూటీసీ టైటిల్ గెలిచే జ‌ట్టుకు ఈసారి 3.6 మిలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ. 30.8 కోట్లు) ప్రైజ్‌మ‌నీ సొంత‌మ‌వుతుంది. ర‌న్న‌ర‌ప్‌కు 2.1 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ. 17.9 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి అందుతుంది. హ్యాట్రిక్ ఫైన‌ల్ మిస్స‌యి 3వ స్థానంలో నిలిచిన‌ టీమిండియా కూడా భారీగానే ప్రైజ్‌మ‌నీ అందుకోబోతోంది. మూడో స్థానంలో నిలిచిన‌ప్ప‌టికీ గ‌త రెండు ఎడిష‌న్ల‌ విజేత‌ల కంటే ఎక్కువ సొమ్మును భార‌త్ ద‌క్కించుకోబోంది. 1.44 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ. 12.34 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి పొంద‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 4వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు 1.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ (దాదాపు రూ. 10.26 కోట్లు) ప్రైజ్‌మ‌నీ వ‌స్తుంది.

పాపం పాకిస్థాన్‌!
పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు ప‌రిస్థితి రానురాను మ‌రింత ద‌య‌నీయంగా త‌యార‌వుతోంది. డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-2025లో పాక్ టీమ్ చివ‌రి స్థానంతో స‌రిపెట్టుకుంది. దీంతో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ క‌న్నా త‌క్కువ మొత్తం ఆ జ‌ట్టుకు ద‌క్కుతుంది. బంగ్లాదేశ్‌ 7.2 ల‌క్ష‌ల డాల‌ర్లు (దాదాపు రూ. 6.16 కోట్లు), వెస్టిండీస్‌ 6.1 ల‌క్ష‌ల‌ డాల‌ర్లు (సుమారు రూ. 5.21 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తిగా అందుకోనున్నాయి. పాకిస్థాన్‌కు దాదాపు 4.1 కోట్ల రూపాయ‌ల‌ (4.8 ల‌క్ష‌ల డాల‌ర్లు) న‌గ‌దు మాత్ర‌మే ద‌క్క‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో బంగ్లాదేశ్ 7, వెస్టిండీస్ 8 స్థానాల్లో నిల‌వ‌గా, పాకిస్థాన్ చివ‌రిదైన 9వ స్థానంలో ఉంది.

డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంగ్లండ్‌, శ్రీలంక ఐదారు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్ 9.6 ల‌క్ష‌ల డాల‌ర్లు (సుమారు రూ. 8.21 కోట్లు), శ్రీలంక 8.4 ల‌క్ష‌ల డాల‌ర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు) న‌గదు బ‌హుమ‌తి అందుకుంటాయి. కాగా, 2019-21లో న్యూజిలాండ్‌, 2021-23లో ఆస్ట్రేలియా డ‌బ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు జ‌ట్లు ఇండియాపైనే గెల‌వ‌డం గ‌మ‌నార్హం.

డ‌బ్ల్యూటీసీ 2025 ప్రైజ్‌మ‌నీ వివ‌రాలు
1. విజేత‌: రూ. 30.8 కోట్లు
2. ర‌న్న‌ర‌ప్‌: రూ. 17.9 కోట్లు
3. ఇండియా: రూ. 12.34 కోట్లు
4. న్యూజిలాండ్‌: రూ. 10.26 కోట్లు
5. ఇంగ్లండ్‌: రూ. 8.21 కోట్లు
6. శ్రీలంక‌: రూ. 7.18 కోట్లు
7. బంగ్లాదేశ్‌: రూ. 6.16 కోట్లు
8. వెస్టిండీస్‌: రూ. 5.21 కోట్లు
9. పాకిస్థాన్‌: రూ.4.1 కోట్లు

చ‌ద‌వండి: అమ్మ‌కానికి ఆర్సీబీ..?, ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement