
గత కొన్ని రోజులుగా ఆర్సీబీ అభిమానులు మిశ్రమ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 3న ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ గెలుపును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు అవథుల్లేకుండా ఎంజాయ్ చేశారు.
అయితే ఆ మరుసటి రోజే ఓ ఊహించని ఘటన ఆర్సీబీ అభిమానులను కృంగదీసింది. విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు.
ఈ విషాద ఘటన నుండి తేరుకోకఉందే ఆర్సీబీ అభిమానులకు మరో షాకింగ్ వార్త తెలిసింది. ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. సదరు కథనం ప్రకారం, ఆర్సీబీ చేతులు మారే అవకాశం ఉంది. ప్రస్తుత యాజమాన్యం (డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్) ఆర్సీబీని సుమారు 2 బిలియన్ డాలర్లకు విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఎందుకు విక్రయించాలని అనుకుంటుందంటే..?
ఆర్సీబీకి భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ ఫ్రాంచైజీ ఒక్కసారే టైటిల్ గెలిచినా (అది కూడా ఈ ఏడాదే) ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా చలామణి అవుతుంది. దీన్నే ప్రస్తుత యాజమాన్యం క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఫ్రాంచైజీ యొక్క పెరుగుతున్న విలువను ఉపయోగించుకుని ఎక్కువ భాగం కాకపోయినా, కొన్ని వాటాలైనా విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా యునైటెడ్ స్పిరిట్స్ భారీగా లబ్ది పొందే అవశామున్నట్లు సమాచారం.
యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని విక్రయించడానికి మరో కారణం కూడా ఉండొచ్చని తెలుస్తుంది. గత కొన్ని సీజన్ల నుండి బీసీసీఐ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ కంటెంట్ ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించింది. దీని వల్ల యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తుల యొక్క ప్రచారం కష్టతరం అవుతుంది. ఇది తమ కంపెనీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని యునైటెడ్ స్పిరిట్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆందోళనలో ఫ్యాన్స్
ఇదిలా ఉంటే, యాజమాన్యం చేతులు మారే ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వారు ఎంతగానో ఇష్టపడే ఆర్సీబీ పేరు మారుతుందేమోనని దిగాలు పడుతున్నారు.
విజయ్ మాల్యా నుంచి చేజిక్కించుకున్న డియాజియో
ఆర్సీబీకి భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా పురుడు పోశాడు. వేర్వేరు కారణాల వల్ల మాల్యా తన స్పిరిట్స్ వ్యాపారాన్ని డియాజియోకు విక్రయించడంతో వారి భారత విభాగం 'యునైటెడ్ స్పిరిట్స్' ఆర్సీబీ యాజమాన్యాన్ని చేజిక్కించుకుంది.
డియాజియో గురించి చెప్పాలంటే.. ఇది 1997లో స్థాపించబడిన బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ పానీయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ.