భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ 452/6 డిక్లేర్డ్
శ్రీలంక ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 113/2
గాలె: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 333/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ధ్రువ్ జురేల్ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 111.4 ఓవర్లలో 452/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (215 బంతుల్లో 141 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదంతొక్కాడు.
ఆంధ్రప్రదేశ్ ఆటగాడు షేక్ రషీద్ (113 బంతుల్లో 63; 5 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో పది పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. దీంతో 136 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రషీద్ అవుటైనా... హర్ష్ దూబే (51 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో ధ్రువ్ జురేల్ దూకుడు కొనసాగించాడు. లంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న జురేల్... వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
లంక బౌలర్లలో చమిక గుణశేకర 3 వికెట్లు పడగొట్టగా... డిలుమ్ సుదీర రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నువానీడు ఫెర్నాండో (103 బంతుల్లో 65 బ్యాటింగ్; 7 ఫోర్లు) అజేయ హాఫ్సెంచరీతో పోరాడుతున్నాడు. ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (10), పవంత వీరసింఘే (11) విఫలమవడంతో ఒక దశలో లంక 38/2తో కష్టాల్లో పడింది.
అయితే ఈ దశలో అషెన్ బండారా (51 బంతుల్లో 18 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్కు 75 పరుగులు జోడించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న శ్రీలంక ‘ఎ’ జట్టు... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు స్కోరుకు ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉంది. ఫెర్నాండో, బండారా క్రీజులో ఉన్నారు. భారత ‘ఎ’ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.


