'లీడ్స్‌' వదిలేశారు.. ఇంగ్లండ్‌ చేతిలో గిల్‌ సేన ఓటమి | India lost the first Test | Sakshi
Sakshi News home page

IND vs ENG 1st Test: 'లీడ్స్‌' వదిలేశారు.. ఇంగ్లండ్‌ చేతిలో గిల్‌ సేన ఓటమి

Jun 25 2025 3:48 AM | Updated on Jun 25 2025 10:15 AM

India lost the first Test

తొలి టెస్టులో భారత్‌ పరాజయం

5 వికెట్లతో నెగ్గిన ఇంగ్లండ్‌

371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు

డకెట్‌ సెంచరీ, రాణించిన రూట్‌

జూలై 2 నుంచి రెండో టెస్టు  

తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శన... రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 835 పరుగులు... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు... బుమ్రా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన... అన్నీ సానుకూలతలే కనిపించినా... చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. తొలి టెస్టుల్లో పలు సందర్భాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ తుది దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. గెలుపు కోసం చివరి రోజు 350 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్‌ మొదటి ఓవర్‌ నుంచే పరుగుల వేటలో పడింది. 

వ్యూహాత్మకంగా బుమ్రా బౌలింగ్‌లో సాహసం చేయని బ్యాటర్లు ఇతర బౌలర్లపై చెలరేగి జోరుగా సాగిపోయారు. తాము ఆశించిన రీతిలో ‘బజ్‌బాల్‌’ శైలిలో ఎక్కడా తగ్గకుండా 4.54 రన్‌రేట్‌తో దూసుకుపోయిన ఇంగ్లండ్‌ ఘన విజయాన్ని అందుకుంది. డకెట్‌ మెరుపు సెంచరీకి క్రాలీ అండగా నిలవగా... చివర్లో రూట్‌ కీలక అర్ధ సెంచరీతో జట్టును నడిపించాడు. తొలి టెస్టులో ఓటమి పక్షాన నిలిచిన కొత్త కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సిరీస్‌లో మున్ముందు ఎలాంటి ఫలితాలు రాబడతాడనేది చూడాలి.  

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్‌ పరాజయంతో మొదలు పెట్టింది. హెడింగ్లీ మైదానంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 21/0తో ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ (170 బంతుల్లో 149; 21 ఫోర్లు, 1 సిక్స్‌), జాక్‌ క్రాలీ (126 బంతుల్లో 65; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా... ఆఖర్లో జో రూట్‌ (84 బంతుల్లో 53 నాటౌట్‌; 6 ఫోర్లు), జేమీ స్మిత్‌ (55 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

రూట్, స్మిత్‌ ఆరో వికెట్‌కు అభేద్యంగా 71 పరుగులు జత చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ పని పట్టిన స్టార్‌ పేసర్‌ బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగినా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1–0తో ముందంజ వేసింది. సిరీస్‌లో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. 

భారీ భాగస్వామ్యం... 
ఇంగ్లండ్‌ ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ చివరి రోజు ఆటను జాగ్రత్తగా మొదలు పెట్టారు. అయితే నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో ధాటిని పెంచారు. ఈ క్రమంలో ముందుగా 66 బంతుల్లో డకెట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 42 పరుగుల వద్ద క్రాలీ ఇచ్చిన కఠినమైన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో బుమ్రా విఫలమయ్యాడు. లంచ్‌ వరకు కూడా ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ జోడీని విడదీయడంలో భారత్‌ విఫలమైంది. 

తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 24 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. విరామం తర్వాత 111 బంతుల్లో క్రాలీ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మరింత జోరుగా ఆడారు. 97 పరుగుల వద్ద డకెట్‌ ఇచి్చన క్యాచ్‌ జైస్వాల్‌ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. తర్వాతి ఓవర్లోనే డకెట్‌ 121 బంతుల్లో కెరీర్‌లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్వల్ప వర్షం కారణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది.  

గెలిపించిన రూట్, స్మిత్‌... 
వాన ఆగిన తర్వాత భారత్‌కు సానుకూల ఫలితం వచ్చింది. ఎట్టకేలకు క్రాలీని అవుట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించిన ప్రసిద్‌... తన తర్వాతి ఓవర్లోనే ఒలీ పోప్‌ (8)ను కూడా పెవిలియన్‌ పంపించాడు. ఈ దశలో డకెట్, రూట్‌ మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో శార్దుల్‌కు బంతి అప్పగించడం భారత్‌కు మేలు చేసింది.

దూకుడుగా ఆడుతున్న డకెట్‌తో పాటు హ్యారీ బ్రూక్‌ (0)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసి శార్దుల్‌ ఒక్కసారిగాటీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే రూట్, బెన్‌ స్టోక్స్‌ (51 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు 77 బంతుల్లో 49 పరుగులు జత చేశారు. అయితే జడేజా బౌలింగ్‌ పదే పదే రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించిన స్టోక్స్‌ అదే షాట్‌ ఆడి నిష్క్రమించాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ మరో 69 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత బృందంలో కాస్త ఆశలు రేగాయి. 

అయితే అనుభవజు్ఞడైన రూట్‌ అండగా యువ కీపర్‌ స్మిత్‌ ఒత్తిడిని అధిగమించి చక్కటి షాట్లు ఆడటంతో ఇంగ్లండ్‌ గెలుపునకు చేరువైంది. భారత్‌ కొత్త బంతిని తీసుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన స్మిత్‌...అదే ఓవర్‌ చివరి బంతికి మరో సిక్స్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు.   

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 364; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 65; డకెట్‌ (సి) (సబ్‌) నితీశ్‌ రెడ్డి (బి) శార్దుల్‌ 149; పోప్‌ (బి) ప్రసిధ్‌ 8; రూట్‌ (నాటౌట్‌) 53; బ్రూక్‌ (సి) పంత్‌ (బి) శార్దుల్‌ 0; స్టోక్స్‌ (సి) గిల్‌ (బి) జడేజా 33; స్మిత్‌ (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1–188, 2–206, 3–253, 4–253, 5–302. బౌలింగ్‌: బుమ్రా 19–3–57–0, సిరాజ్‌ 14–1–51–0, జడేజా 24–1–104–1, ప్రసిధ్‌ 15–0–92–2, శార్దుల్‌ 10–0–51–2.  

5 ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది.

2 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇది రెండో అతి పెద్ద ఛేదన. 2022లో భారత్‌పైనే బర్మింగ్‌హామ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

6 హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్‌ వరుసగా ఆరో టెస్టు గెలిచింది. ఈ ఆరు సార్లు జట్టు లక్ష్యాలను ఛేదించడం విశేషం.

3 టెస్టు మ్యాచ్‌ నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ 350కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.

1673 భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఒకే టెస్టులో నమోదైన మొత్తం పరుగులు. ఈ రెండు జట్ల మధ్య ఇదే అత్యధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement