credit: BCCI X
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోని యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని యార్క్షైర్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.
31 ఏళ్ల ఎడమచేతి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఐదు మ్యాచ్లు ఆడనున్నాడు. అనంతరం సెప్టెంబర్లో జరిగే రోతెసే కౌంటీ ఛాంపియన్షిప్ చివరి నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు. కుల్దీప్ శుక్రవారం గ్లామోర్గన్తో జరిగే వన్డే మ్యాచ్ ద్వారా యార్క్షైర్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
యార్క్షైర్తో ఒప్పందంపై స్పందించిన కుల్దీప్, "యార్క్షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టం. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆడాలనే ఆసక్తి మరింత పెరిగింది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.
కాగా, కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున సరైన అవకాశాలు రావడం లేదు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపటి నుంచి జరుగబోయే జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు.
దీంతో అతడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు.కుల్దీప్.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అతడి వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు.


