జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు ఇదే! ఐపీఎల్ హీరోల‌కు చోటు | IND Vs ZIM: IPL Stars Riyan Parag, Nitish Reddy Get Maiden BCCI Call | Sakshi
Sakshi News home page

IND vs ZIM: జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు ఇదే! ఐపీఎల్ హీరోల‌కు చోటు

Jun 24 2024 8:31 PM | Updated on Jun 24 2024 9:12 PM

IND vs ZIM: IPL stars Riyan Parag, Nitish Reddy get maiden BCCI call

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.

ఈ సిరీస్‌కు రెగ్యూల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు సీనియ‌ర్ ఆట‌గాళ్లు సెల‌క్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్‌లో భార‌త జ‌ట్టుకు యువ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.

అదే విధంగా ఈ సిరీస్‌కు భార‌త జ‌ట్టులో ఐపీఎల్‌లో హీరోల‌కు చోటు ద‌క్కింది. ఐపీఎల్‌-2024లో అద‌ర‌గొట్టిన తెలుగు తేజం  నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శర్మ, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ పరాగ్, సీఎస్‌కే పేస‌ర్ తుషార్ దేశ్ పాండేల‌కు సెల‌క్ట‌ర్లు తొలిసారి జాతీయ జ‌ట్టులో చోటు క‌ల్పించారు.

నితీష్ కుమార్ 
ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. త‌న ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ ఆంధ్ర ఆట‌గాడు ఎస్ఆర్‌హెచ్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు.

 ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ 33.67 స‌గ‌టుతో 303 ప‌రుగులతో పాటు 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదేవిధంగా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెల‌క్ట‌ర్లు తొలిసారి పిలుపునిచ్చారు.

అభిషేక్ శ‌ర్మ‌
ఐపీఎల్‌-2024లో అభిషేక్ శ‌ర్మ సైతం సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రిచాడు. అభిషేక్ ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్‌గా  ట్రావిస్ హెడ్‌తో క‌లిసి భీబ‌త్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. 

ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ 32.27 స‌గ‌టుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్‌లో సైతం అదరగొడుతున్నాడు.

రియాన్ ప‌రాగ్‌..
ఇక ఆస్సాం స్టార్ ఆల్‌రౌండ‌ర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్‌-2024లో అద‌ర‌గొట్టాడు. ఓవ‌రాక్ష‌న్ స్టార్ అని అంద‌రితో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ప‌రాగ్.. ఈ ఏడాది సీజ‌న్‌లో మాత్రం అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 

రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాత‌నిథ్యం వ‌హిస్తున్న ప‌రాగ్ త‌న ఆట‌తీరుతో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.  ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన ప‌రాగ్‌ 52.09 స‌గ‌టుతో 573 పరుగులు చేశాడు.

ఈ క్ర‌మంలో అత‌డికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులోకి చోటు ద‌క్కుతుంద‌ని భావించారు. కానీ సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌డిని ఎంపిక చేయ‌లేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌కు సీనియ‌ర్లు దూరం కావ‌డంతో సెల‌క్ట‌ర్లు ప‌రాగ్‌కు అవ‌కాశ‌మిచ్చారు. 

తుషార్ దేశ్‌పాండే..
ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే కూడా త‌న బౌలింగ్‌తో అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు. గ‌త రెండు సీజ‌న్ల నుంచి దేశ్‌పాండే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు.

ఐపీఎల్‌-2024లో 13 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కేవ‌లం ఐపీఎల్‌లో మాత్రం దేశీవాళీ క్రికెట్‌లో కూడా ముంబై త‌ర‌పున దేశ్‌పాండే రాణిస్తున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement