జింబాబ్వే పర్యటనకు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా వరుణ్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు.
దీంతో చివరి రెండు టీ20లకు అతడు అందుబాటులో లేడు. అయితే ఈ మిస్టరీ స్పిన్నర్ గాయం కాస్త తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు జింబాబ్వే టూర్ నుంచి కూడా వైదొలగుతున్నట్లు సమాచారం.
దీంతో వరుణ్ స్ధానంలో మరో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ రాజస్తాన్ స్పిన్నర్ ఇంగ్లండ్ సిరీస్లో తీవ్ర నిరాశపరిచాడు. రెండు మ్యాచ్లు ఆడిన బిష్ణోయ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.
తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. కానీ ఇప్పుడు వరుణ్ గాయపడడంతో బిష్ణోయ్కు మరో అవకాశం లభించింది. మరోవైపు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు.
అతడి స్ధానంలో అర్షద్ ఖాన్ లేదా గుర్నూర్ బ్రార్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూలై 23 నుంచి జింబ్వాబేతో మూడు టీ20ల సిరీస్లో భారత్ తలపడనుంది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే.


