గంభీర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కార్తీక్ | Harshit Rana Over Shivam Dube Angers RCB Top Boss, Gautam Gambhir Ripped | Sakshi
Sakshi News home page

గంభీర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కార్తీక్

Jul 8 2026 12:05 PM | Updated on Jul 8 2026 12:55 PM

Harshit Rana Over Shivam Dube Angers RCB Top Boss, Gautam Gambhir Ripped

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఛేదనలో శివమ్ దూబే కంటే ముందు పేసర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపడంపై మాజీ భారత వికెట్‌కీపర్, వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కామెంట్రీ సమయంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టాడు.

"శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు రావడమా..? నిజంగానేనా..? దేశవాళీ క్రికెట్‌లో కూడా హర్షిత్ రాణా పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేసిన సందర్భం నాకు గుర్తులేదు. ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్ కోసం కొన్ని మార్పులు చేయొచ్చు. కానీ అందుకే శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను పంపడం సమంజసం కాదు" అని వ్యాఖ్యానించాడు.

గంభీర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోగా.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ కేవలం 76 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం టీమిండియా చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నమోదైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు పరుగులను నియంత్రించలేకపోయారు.

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో చెలరేగగా, జోష్ టంగ్ మధ్య, చివరి వరుస బ్యాటర్లను కట్టడి చేశాడు. పవర్‌ప్లే ముగిసేలోపే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లు కోల్పోవడంతో భారత్ కోలుకోలేకపోయింది.

ఈ దశలో అందరూ శివమ్ దూబే బ్యాటింగ్‌కు వస్తాడని భావించినా, జట్టు యాజమాన్యం అనూహ్యంగా హర్షిత్ రాణాను పంపింది. ఈ నిర్ణయంపైనే దినేశ్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ ఓటమితో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement