IND Vs AUS: 'స్టుపిడ్‌.. స్టుపిడ్‌! నీవు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు' | IND Vs AUS 4th Test: Sunil Gavaskar Slams Rishabh Pant For Terrible Shot Selection, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs AUS: స్టుపిడ్‌.. స్టుపిడ్‌! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్‌

Dec 28 2024 3:25 PM | Updated on Dec 28 2024 3:49 PM

IND vs AUS 4th Test: Sunil Gavaskar Livid With Rishabh Pant

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. తొలి మూడు టెస్టుల్లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన పంత్‌.. ఇప్పుడు మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. కీల‌క‌మైన బాక్సింగ్ డే టెస్టులో పంత్ నిరాశప‌రిచాడు.

తొలుత మంచి ట‌చ్‌లో క‌న్పించిన పంత్‌.. ఓ చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను పంత్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆసీస్ స్పీడ్ స్టార్ స్కాట్ బోలాండ్ ఓవ‌ర్‌లో లాంగ్-లెగ్ మీదుగా ల్యాప్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఈ షాట్ ఆడే క్ర‌మంలో బ్యాలెన్స్ కోల్పోయిన‌ పంత్ కింద ప‌డిపోయాడు.

అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్న నాథ‌న్ లియోన్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 28 ప‌రుగులు చేసిన పంత్ నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు.

స‌న్నీ ఈజ్ ఫైర్‌.. 
ఈ క్ర‌మంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌.. రిష‌బ్ పంత్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. భారత్ కు పాలో ఆన్ గండం ఉన్నప్పటికీ పంత్ నిర్లక్ష్యంగా ఆడ‌టంపై గావ‌స్క‌ర్ మండిప‌డ్డాడు.

"స్టుపిడ్‌! స్టుపిడ్‌! స్టుపిడ్‌! ఇద్ద‌రు ఫీల్డ‌ర్లు ఉన్న‌ప్ప‌టికి ఆ చెత్త షాట్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది. అంత‌కుముందే ఆ షాట్‌కు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యావు. వెంట‌నే మ‌ళ్లీ అదే షాట్ ఆడి వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నావు. ఇంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. 

ఓ కీల‌క ఆట‌గాడిగా క్రీజులో ఉన్న‌ప్పుడు జ‌ట్టు ప‌రిస్థితిని ఆర్దం చేసుకుని ఆడాలి. అస్స‌లు ఆ స‌మ‌యంలో ఆ షాట్ ఆడాల్సిన అవ‌స‌రం లేదు. ఇది మీ నేచ‌ర‌ల్ గేమ్ కాదు. అత‌డు ఆడిన స్టుపిడ్ షాట్‌.. టీమ్ మొత్తాన్ని తీవ్ర నిరాశ‌ప‌రిచింది. అతడు భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లొద్దు.

ఇతర డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాలి" అంటూ స‌న్నీ ఫైర‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.

టీమిండియా ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బ్యాటర్లలో నితీశ్‌ ​కుమార్‌ రెడ్డి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన విరోచిత పోరాటంతో నితీశ్‌ అదుకున్నాడు. నితీశ్‌ ప్రస్తుతం 105 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మూడో రోజు ఆటలో నితీశ్‌ పాటు వాషింగ్టన్‌ సుందర్‌(50) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement