
ఇంగ్లండ్ పర్యటనను భారత అండర్-19 జట్టు ఘనంగా ఆరంభించింది. హోవ్ వేదికగా శుక్రవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఇసాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ధాటిగా ఆడగా... మిడిలార్డర్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత యువ బౌలర్లలో కనిష్క్ చౌహన్ 3, హెనిల్ పటేల్, అంబ్రీశ్, మొహ్మద్ ఇనాన్ తలా 2 వికెట్లు తీశారు.
వైభవ్ విధ్వంసం..
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కేవలం 24 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. భారత ఓపెనర్, ఐపీఎల్ సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 48 పరుగులు చేశాడు.
కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి తొలి వికెట్కు 71 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే వీళ్లిద్దరు అవుటైనప్పటికీ అభిజ్ఞాన్ కుండు (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో ఏ ఇబ్బంది లేకుండా యువభారత్ గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫ్రెంచ్ 2 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 30న రెండో వన్డే నార్తాంప్టన్లో జరుగుతుంది.
చదవండి: అది ఆసీస్కు రిటర్న్ గిఫ్ట్