వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి! | If you removing Sanju, Surya Remove him too: India Ex Star Slams Gambhir | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!

Jul 11 2026 4:28 PM | Updated on Jul 11 2026 4:35 PM

If you removing Sanju, Surya Remove him too: India Ex Star Slams Gambhir

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో బీసీసీఐ అతడి స్థానాన్ని గౌతం గంభీర్‌తో భర్తీ చేసింది. అయితే, గంభీర్‌ మార్గదర్శనంలో తొలుత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్‌.. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది.

ఇక ఆ తర్వాత కూడా గంభీర్‌ మార్గదర్శనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. అందుకు ద్రవిడ్‌కే క్రెడిట్‌ ఇవ్వాల్సి ఉంటుందని.. నాటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

ఆ రెండూ మినహా...
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026లోనూ టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ.. స్వదేశంలో సిరీస్‌ జరగడం సానకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు మెగా టోర్నీలు గెలిచినప్పటికీ.. గంభీర్‌ మార్గదర్శనంలో టీమిండియా అత్యంత ఘోర పరాభవాలు చవిచూసింది.

సొంతగడ్డపై న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ కావడం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకపోవడం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ను కూడా భారత్‌ కోల్పోయింది.

వ్యంగ్యాస్త్రాలు 
తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 చాంపియన్‌ హోదాలో ఐర్లాండ్‌లో అడుగుపెట్టి.. పసికూన చేతిలో ఏకంగా 2-0తో వైట్‌వాష్‌ అయింది. అనంతరం ఇంగ్లండ్‌కు కూడా 0-3తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ గంభీర్‌, జట్టు యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

‘‘అయినా అతడి (గంభీర్‌)ని ప్రశ్నించేందుకు ఎవరైనా ఉన్నారా?.. అతడిని తప్పుకోమని చెప్పగల ధైర్యం ఉందా?.. ఈరోజు ఇంతజరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అతడు ప్రపంచకప్‌ గెలిచాడని చెబుతారు.

వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!
మరి సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా కెప్టెన్‌గా కప్పు గెలిచాడు. అయినా సరే అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. అయినా కూడా అతడిని తుదిజట్టు నుంచి తప్పించారు.

మరి వాళ్లిద్దరిలాగే గంభీర్‌పై వేటు వేయలేరా?.. మీ ఆలోచనా విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందా?’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ యాజమాన్యం తీరును తూర్పారబట్టాడు. అదే విధంగా.. ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్‌ ఓడిపోయినప్పటికీ గంభీర్‌ ముఖంలో కాస్తైనా బాధ కనిపించలేదని చిక్కా మండిపడ్డాడు.

కొంచెం కూడా బాధ లేదు
‘‘తననూ ఎవరు టచ్‌ చేయలేరని అతడికి తెలుసు. అందుకే డగౌట్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు. అసలు జట్టు ఓడిపోతోందన్న బాధ అతడిలో కొంచెం కూడా కనిపించలేదు. ఎన్నో సిరీస్‌లలో వైట్‌వాష్‌లు, ఘోర పరాభవాలు.

అయినా సరే అతడిని కదిలించేవారే లేరు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకంతోనే అతడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: IND vs ENG 5th T20I: భారత తుదిజట్టు ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement