ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్లో ఘన సాధించింది. తొలి మ్యాచ్లో పాక్ను చిత్తుగా ఓడించిన భారత్.. ఇవాళ (జూన్ 17) జరిగిన రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్పై అదే తరహా విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ను 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ చేసి, 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
చెలరేగిన మంధన, షఫాలీ
నెదర్లాండ్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు స్మృతి మంధన (47 బంతుల్లో 74; 11 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (38 బంతుల్లో 55; 10 ఫోర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (8 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (2 బంతుల్లో 10 నాటౌట్; ఫోర్, సిక్స్), కెప్టెన్ హర్మన్ప్రీత్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించారు.
జెమీమా రోడ్రిగ్స్ 19, యస్తికా భాటియా 3 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఐరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, వాన్ డెన్ రాడ్ తలో వికెట్ తీశారు.
శ్రీ చరణి మాయాజాలం.. బంతితోనూ సత్తా చాటిన షఫాలీ
210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆ జట్టు టాప్-4 బ్యాటర్స్ మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి నెదర్లాండ్స్ ప్లేయర్లంతా బెంబేలెత్తిపోయారు.
శ్రీ చరణి (4-0-19-4) దెబ్బకు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆమెకు షఫాలీ వర్మ (3.2-0-20-3) కూడా తోడవ్వడంతో నెదర్లాండ్స్ చివరి 5 వికెట్లు కేవలం 9 బంతుల వ్యవధిలో కోల్పోయింది. మిగతా భారత బౌలర్లలో నందిని శర్మ 2, దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టారు.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో వారి కెప్టెన్ బాబెట్ డి లీడ్ చేసిన 28 పరుగులే అత్యధికం. జూన్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికాతో తలపడనుంది.


