ఆ రెండు పిచ్‌లు అసంతృప్తికరం..! | ICC Rates T20 World Cup 2024 Pitches: New York, Trinidad Rated Unsatisfactory | Sakshi
Sakshi News home page

ఆ రెండు పిచ్‌లు అసంతృప్తికరం.. టి20 వరల్డ్‌కప్‌ వేదికలపై ఐసీసీ నివేదిక

Aug 21 2024 7:11 AM | Updated on Aug 21 2024 8:54 AM

ICC Rates T20 World Cup 2024 Pitches: New York, Trinidad Rated Unsatisfactory

దుబాయ్‌: టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య వెస్టిండీస్‌లో జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన టరోబా పిచ్‌ సంతృప్తికరంగా లేదని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వెల్లడించింది. మెగా టోర్నీ ముగిసిన రెండు నెలల తర్వాత పిచ్‌లపై ఐసీసీ మంగళవారం నివేదిక విడుదల చేసింది. టరోబా పిచ్‌తో పాటు.. అమెరికాలో నిర్వహించిన ప్రపంచకప్‌ తొలి రెండు మ్యాచ్‌లకు వేదికగా ఉన్న న్యూయార్క్‌ పిచ్‌లు కూడా బాగాలేవని ఐసీసీ వెల్లడించింది. 

తాత్కాలికంగా నిర్మించిన స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్‌ కాగా... భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 96 పరుగులకు పరిమితమైంది. అస్థిర బౌన్స్‌తో ఆ పిచ్‌లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయని అప్పుడే వ్యాఖ్యతలు పేర్కొనగా... తాజాగా ఆ రెండింటిని ఐసీసీ ‘అసంతృప్తికరం’ జాబితాలో చేర్చింది.

ఐర్లాండ్, భారత్‌ మ్యాచ్‌లో అయితే అనూహ్య బౌన్స్‌ కారణంగా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయాల బారిన పడ్డారు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో ఐర్లాండ్‌ బ్యాటర్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో టి20 ప్రపంచకప్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డ్రాప్‌–ఇన్‌ పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన పిచ్‌కు ఐసీసీ మంచి రేటింగ్‌ ఇచ్చింది. 

సాధారణంగా పిచ్‌ల ప్రమాణాలను బట్టి ఐసీసీ ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘సంతృప్తికరం’, ‘అసంతృప్తికరం’, ‘అన్‌ఫిట్‌’ రేటింగ్స్‌ ఇస్తుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వగా.. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గి భారత్‌ చాంపియన్‌గా నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement