ప్రతిష్టాత్మక అవార్డు రేసులో శ్రేయస్‌ అయ్యర్‌ | ICC Men's Player Of The Month Nominees For March 2025 Revealed | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో శ్రేయస్‌ అయ్యర్‌

Apr 8 2025 5:07 PM | Updated on Apr 8 2025 5:20 PM

ICC Men's Player Of The Month Nominees For March 2025 Revealed

2025 మార్చి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్లను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్‌ 8) ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డు రేసులో జేకబ్‌ డఫీ (న్యూజిలాండ్‌), రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (భారత్‌) ఉన్నారు. మహిళల విభాగంలో ఈ అవార్డు కోసం చేతన ప్రసాద్‌ (యూఎస్‌ఏ), జార్జియా వాల్‌ (ఆస్ట్రేలియా), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (ఆస్ట్రేలియా) పోటీ పడుతున్నారు.

స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లు వచ్చే వారం ప్రకటిస్తారు.

జేకబ్‌ డఫీ- మార్చి నెలలో న్యూజిలాండ్‌ పేసర్‌ జేకబ్‌ డఫీ స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు 4 వికెట్ల ప్రదర్శనలు సహా 13 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఢపీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకాడు. డఫీ చెలరేగడంతో పాక్‌తో సిరీస్‌ను కివీస్‌ 4-1 తేడాతో గెలుచుకుంది. 

పాక్‌తో మార్చిలోనే జరిగిన తొలి వన్డేలోనూ డఫీ రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు తీశాడు. మొత్తంగా డఫీ మార్చిలో 6 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును నామినేట్‌ అయ్యాడు.

రచిన్‌ రవీంద్ర విషయానికొస్తే.. ఈ కివీస్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో 3 వన్డేలు ఆడి 50.33 సగటున 151 పరుగులు చేశాడు. అలాగే 4.66 ఎకానమీ రేట్‌తో 3 వికెట్లు తీశాడు. రచిన్‌ ఈ టోర్నీ సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై సెంచరీ (108) చేశాడు. ఈ టోర్నీలో రచిన్‌కు ఇది రెండో సెంచరీ. అంతకుముందు ఫిబ్రవరిలో రచిన్‌ మరో సెంచరీ చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌ ఫైనల్‌ వరకు చేరి తుది సమరంలో భారత్‌ చేతిలో ఓటమిపాలైంది.

శ్రేయస్‌ అయ్యర్‌- శ్రేయస్‌ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్‌ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్‌ భారత్‌ తరఫున లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడంలో శ్రేయస్‌ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో 79 పరుగులు చేసిన శ్రేయస్‌.. సెమీస్‌లో ఆసీస్‌పై 45, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్‌ మిడిలార్డర్‌లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 

Advertisement
 
Advertisement
Advertisement