తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా | Prithvi Shaw On His Struggles In Career, Says I Made Some Wrong Friends No Big Cricketer Called Me Except | Sakshi
Sakshi News home page

తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా

Jun 26 2025 9:45 AM | Updated on Jun 26 2025 12:25 PM

I Made Some Wrong Friends No Big Cricketer Called Me Except: Prithvi Shaw

భారత క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్‌ టెండుల్కర్‌ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్‌ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా కెరీర్‌ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.

గిల్‌ ఏకంగా టీమిండియా సారథి అయితే..
అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్‌ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.

ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్‌లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్‌లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్‌24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.

పంత్‌ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్‌ సర్‌కు తెలుసు
తాను కెరీర్‌ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్‌ క్రికెటర్‌’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్‌ టెండుల్కర్‌కు నాకు సమస్యలు తెలుసు.

అర్జున్‌ టెండుల్కర్‌తో పాటు నేను క్రికెటర్‌గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్‌ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్‌ పంత్‌ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.

అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.

తప్పుడు వ్యక్తులతో స్నేహం
అందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్‌లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.

తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్‌గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.

అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్‌లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్‌ సీజన్‌లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.

చదవండి: క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన సల్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement