భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ షురూ కానుంది. అయితే, ఈ మ్యాచ్లో అందరి కళ్లు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి.
గత జింబాబ్వే సిరీస్లో ధనాధన్ బ్యాటింగ్తో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సొంత గడ్డపై ఎలా రాణిస్తాడా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ గురించి అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని కట్టడి చేయడానికి తమ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, అతడి వికెట్ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని జద్రాన్ స్పష్టం చేశాడు.
కాగా సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున వైభవ్ సంచలన ప్రదర్శన చేశాడు. 5 ఇన్నింగ్స్లలో అతను మొత్తం 192 పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్లో తన ప్రతిభను చాటిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు తనకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు.
"వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. ఐపీఎల్లోనే కాకుండా వివిధ స్థాయిలలో ఆడుతూ ఇప్పటికే తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అతడి బ్యాటింగ్ గురించి మా జట్టులో విస్తృతంగా చర్చించాం. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్నవారు కావడంతో.. వైభవ్ బలాలు, బలహీనతలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.
అంతేకాకుండా అతడి బ్యాటింగ్ వీడియోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. అతడిని త్వరగా అవుట్ చేసేందుకు మా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం" అని జద్రాన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్లో?


