భార‌త్ రాక‌పోయినా న‌ష్టం లేదు.. ఆ టోర్నీ మాత్రం పాక్‌లోనే: హసన్‌ అలీ | Hasan Ali comments on BCCI not sending team to Pakistan for Champions Trophy | Sakshi
Sakshi News home page

భార‌త్ రాక‌పోయినా న‌ష్టం లేదు.. ఆ టోర్నీ మాత్రం పాక్‌లోనే: హసన్‌ అలీ

Jul 21 2024 9:22 AM | Updated on Jul 21 2024 12:27 PM

Hasan Ali comments on BCCI not sending team to Pakistan for Champions Trophy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల త‌ర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్య‌మిచ్చేందుకు పాకిస్తాన్ సిద్ద‌మైంది. అయితే ఈ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు పాల్గోన‌డంపై ఇంకా సందిగ్ధం నెల‌కొంది. పాకిస్తాన్‌కు భార‌త జ‌ట్టును పంపిచేందుకు బీసీసీఐ విముఖ‌త చూపుతోంది. భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌ను త‌ట‌స్ధ వేదికల‌పై నిర్వ‌హించాల‌ని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టికే త‌మ నిర్ణ‌యాన్ని బీసీసీఐ అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు సైతం తెలియ‌జేసింది.

ప్ర‌స్తుతం ఈ విష‌యాన్ని ఐసీసీ ప‌రిశీలిస్తోంది. అయితే  పీసీబీ మాత్రం మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ హ‌స‌న్ అలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.ఈ టోర్నీ నుంచి భార‌త్  వైదొలిగినా పాకిస్తాన్ మాత్రం ఛాంపియ‌న్స్ ట్రోఫీని విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తుంద‌ని అలీ థీమా వ్య‌క్తం చేశాడు.

"మేము గ‌తేడాది వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడేందుకు భార‌త్‌కు వెళ్లాము. అటువంటిప్పుడు వారు కూడా పాకిస్తాన్‌కు రావాలి కాదా. క్రీడ‌ల‌ను రాజ‌కీయాల‌కు దూరం పెట్టాల‌ని ఇప్ప‌టికే చాలా మంది లెక్కలేనన్ని సార్లు చెప్పారు. మ‌రోవైపు చాలా మంది భార‌త ఆట‌గాళ్లు సైతం పాకిస్తాన్‌లో ఆడేందుకు స‌ముఖ‌త చూపిస్తున్నారు.

ఈ విష‌యాన్ని భార‌త క్రికెట‌ర్లే ప‌లు ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే భార‌త జ‌ట్టు సైతం పాక్‌కు వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నార‌నే క‌దా. కానీ వారి దేశ విధి విధానాల‌కు కట్టుబ‌డి ఉన్నారు. అయితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లోనే జ‌రుగుతుంద‌ని పీసీబీ చైర్మెన్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఆయ‌న చెప్పిన‌ట్లు ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్‌లోనే జ‌రుగుతుంది.

భార‌త్ రాక‌పోయినా ఈ టోర్నీ మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ పాక్ దాటి వెళ్ల‌దు. క‌చ్చింగా పాక్‌లో ఆడాల్సిందే. భార‌త్ ఆడ‌క‌పోతే ఓవ‌రాల్‌గా క్రికెట్ ముగిసిన‌ట్లు కాదు కాదా. భార‌త్ ఒక్క‌టే కాదు మిగితా టీమ్స్ కూడా ఈ టోర్నీలో ఉన్నాయి" అని స‌మా టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement