అప్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది.
అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు.
ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.


