#GTVsMI-Q2: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే?

Gujarat Titans Enters Final If-Qualifier-2 Vs MI-Washed Out With Rain - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వర్షం కారణంగా టాస్‌ కూడా కాస్త ఆలస్యం కానుంది. మరి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎలిమినేటర్‌ సహా రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు షెడ్యూల్‌లో ఎలాంటి రిజర్వ్‌ డే కేటాయించలేదు.

దీంతో వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు వెళుతుంది. లీగ్‌ స్టేజీలో 20 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా గుజరాత్‌ నిలవగా.. ముంబై ఇండియన్స్‌ 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే రూల్‌ ప్రకారం లీగ్‌ స్టేజీలో ఏ జట్టు ఎక్కువ పాయింట్స్‌ సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది.

అయితే ఇది లాస్ట్‌ ఆప్షన్‌ మాత్రమే. దానికంటే ముందు వర్షం అంతరాయం కలిగించినప్పటికి ఐదు ఓవర్ల మ్యాచ్‌కు అవకాశమిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. ఒకవేళ భారీ వర్షం కారణంగా అది కూడా వీలు కాకపోతే ఇరుజట్లలో  లీగ్‌ స్టేజీలో టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుంది.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023.. లండన్‌లో కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top