బట్లర్‌ మెరుపులు ఇంగ్లండ్‌దే తొలి టి20 | England beat West Indies by 21 runs in the first T20 | Sakshi
Sakshi News home page

బట్లర్‌ మెరుపులు ఇంగ్లండ్‌దే తొలి టి20

Jun 8 2025 2:01 AM | Updated on Jun 8 2025 2:01 AM

England beat West Indies by 21 runs in the first T20

డాసన్‌ ఘనమైన పునరాగమనం 

20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌

వెస్టిండీస్‌కు వరుసగా నాలుగో పరాజయం

చెస్టర్‌ లీ స్ట్రీట్‌:  ఇంగ్లండ్‌ పర్యటనలో వెస్టిండీస్‌ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌ను 0–3తో కోల్పోయిన వెస్టిండీస్‌... మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 21 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

జోస్‌ బట్లర్‌ (59 బంతుల్లో 96; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌తో... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లియామ్‌ డాసన్‌ (20 పరుగులకు 4 వికెట్లు) బంతితో మెరిపించి ఇంగ్లండ్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా... ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. బట్లర్‌ రెండు అర్ధసెంచరీ భాగస్వాముల్లో భాగమయ్యాడు. 

ముందుగా జేమీ స్మిత్‌ (20 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రెండో వికెట్‌కు 40 బంతుల్లో 79 పరుగులు... అనంతరం ఐదో వికెట్‌కు బెథెల్‌ (23 బంతుల్లో 23 నాటౌట్‌; 1 సిక్స్‌)తో కలిసి 42 బంతుల్లో 60 పరుగులు జత చేశాడు. బెన్‌ డకెట్‌ (1), హ్యారీ బ్రూక్‌ (6), టామ్‌ బాంటన్‌ (3), విల్‌ జాక్స్‌ (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెఫర్డ్‌ 2 వికెట్లు తీయగా... అల్జారీ జోసెఫ్, ఆండ్రీ రసెల్, రోస్టన్‌ చేజ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి ఓడిపోయింది. మూడేళ్ల తర్వాత మళ్లీ టి20 మ్యాచ్‌ ఆడిన ఇంగ్లండ్‌ జట్టు ఎడంచేతి వాటం స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌ తన మాయాజాలంతో విండీస్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. 

విండీస్‌ తరఫున ఇవిన్‌ లూయిస్‌ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోస్టన్‌ చేజ్‌ (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), షెఫర్డ్‌ (12 బంతుల్లో 16; 2 ఫోర్లు), జేసన్‌ హోల్డర్‌ (13 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మాథ్యూ పాట్స్, బెథెల్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్‌ నేడు బ్రిస్టల్‌లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement