సొంత గడ్డపై పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ను 90 పరుగుల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ అద్బుత విజయాన్ని లెజెండరీ ఆల్రౌండర్, దివంగత సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అంకితమిచ్చాడు.
యాదృచ్ఛికంగా సోబర్స్ 90వ పుట్టిన రోజు నాడే విండీస్ ఈ మ్యాచ్ గెలవడం గమనార్హం. అంతేకాకుండా కరేబియన్ జట్టు సరిగ్గా 90 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇంకా హైలెట్. కాగా గ్యారీ సోబర్స్ జులై 17న అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
"వెస్టిండీస్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు తరఫున ఈ విజయాన్ని దివంగత దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు అంకితం ఇస్తున్నాం. ఆయన క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. మా జట్టులోని ప్రతి ఒక్కరికీ ఆయనే ఆదర్శం. తన సుదీర్ఘ కెరీర్లో సోబర్స్ సాధించనిది లేదు. ఈ రోజు ఆయన 90వ బర్త్డే. సరిగ్గా మేము కూడా 90 పరుగుల తేడాతో గెలిచాం.
ఇది ఆయన కోసం రాసిపెట్టినట్లే అనిపిస్తోంది. సోబర్స్ను గౌరవించుకోవడానికి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆయన పై నుంచి చూస్తూ సంతోషపడుతుంటారు అనుకుంటున్నా. గార్ఫీల్డ్ సోబర్స్ సర్... వెస్టిండీస్ క్రికెట్కు మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేశామని ఆశిస్తున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలి" అని డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుతూ చేజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
For the Legend With Love 🖤
Historic win for the team on Sir Garry’s 90th. #WIvPAK pic.twitter.com/2yLXAkXQ6a— Windies Cricket (@windiescricket) July 28, 2026


