
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న రెండో మ్యాచ్లో వెస్టిండీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఆదిలో నిదానంగా ఆడినా, ఇన్నింగ్స్ చివర్లో చెలరేగింది.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్) ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
16 ఓవర్లలో తర్వాత 121/4గా ఉండిన విండీస్ స్కోర్.. చివరి 4 ఓవర్లలో రాకెట్ లాగా దూసుకోపోయింది. పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు వచ్చాయి. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్లో 8, ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.
కాగా, ఈ సిరీస్లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (96) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. జేమీ స్మిత్ (38), జేకబ్ బేతెల్ (23 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ వికెట్లు తీశాడు.
అనంతరం బరిలోకి దిగిన విండీస్.. లియామ్ డాసన్ (4-0-20-4) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్, జేకబ్ బేతెల్ తలో 2 వికెట్లు తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో ఎవిన్ లెవిస్ (39) టాప్ స్కోరర్ కాగా.. ఛేజ్ 24, జాన్సన్ ఛార్లెస్ 18, రోవ్మన్ పావెల్ 13, ఆండ్రీ రసెల్ 15, షెపర్డ్ 16, హోల్డర్ 16 (నాటౌట్) పరుగులు చేశారు.