source: X
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల అతి భారీ స్కోర్ చేయగా.. సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది.
129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌత్ జోన్ను తిలక్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్మరణ్ రవిచంద్రన్తో కలిసి ఐదో వికెట్కు 45 పరుగులు, శ్రేయస్ గోపాల్తో కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తిలక్ 56, చామ మిలింద్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
సౌత్ జోన్ ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. రికీ భుయ్ 1, నారాయణ్ జగదీశన్ 32, షేక్ రషీద్ 27, స్మరణ్ రవిచంద్రన్ 23, శ్రేయస్ గోపాల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్, ఖురేషి చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.
చదవండి: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!


