వారెవ్వా వైభవ్‌ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ! | Vaibhav Sooryavanshi Leadership Skills Forces Ishan To Take This Step Video | Sakshi
Sakshi News home page

వారెవ్వా వైభవ్‌ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ!

Sep 8 2026 1:41 PM | Updated on Sep 8 2026 2:03 PM

Vaibhav Sooryavanshi Leadership Skills Forces Ishan To Take This Step Video

PC: BCCI Domestic X

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్‌ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్‌బాల్‌ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.

అపుడే వైస్‌ కెప్టెన్‌గానా?
ప్రతిష్టాత్మక దులిప్‌ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్‌ జోన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్‌ కిషన్‌కు వైభవ్‌ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్‌ సూర్యవంశీని వైస్‌ కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

అయితే, వైభవ్‌ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్‌ జోన్‌తో సెమీ ఫైనల్లో ఇషాన్‌ గైర్హాజరీలో వైభవ్‌ ఒకరోజు మొత్తం కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.

708 పరుగులకు ఆలౌట్‌
ఇక టైటిల్‌ పోరులో ఈస్ట్‌ జోన్‌ సౌత్‌ జోన్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్‌ జోన్‌ తమ బ్యాటింగ్‌ మొదలుపెట్టింది.

సందిగ్దంలో జట్టు
ఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్‌ జోన్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ వేసిన రెండో బంతిని సౌత్‌ జోన్‌ ఓపెనర్‌ రికీ భుయ్‌ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్‌ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్‌ ఆడటంలో విఫలం కాగా.. వికెట్‌ కీపర్‌ కుమార్‌ కుశాగ్రా బంతిని క్యాచ్‌ పట్టి.. అప్పీలు చేశాడు.

ఇషాన్‌ను ఒప్పించిన వైభవ్‌
అయితే, ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ దగ్గరికి వెళ్లిన వైభవ్‌ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్‌ను తాకిందా? లేదంటే ప్యాడ్‌కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.

అయితే, ఇషాన్‌ కిషన్‌ వైభవ్‌ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్‌ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్‌ జోన్‌ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్‌ సూర్యవంశీని ఇషాన్‌, ముకేశ్‌తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దులిప్‌ ట్రోఫీ ఫైనల్లో వైభవ్‌ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.

చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement