source: X
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో షమీతో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లందరినీ అంపైర్ హెచ్చరించారు.
మ్యాచ్ మూడో రోజు చివరి సెషన్లో (60వ ఓవర్) ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ బంతిని పరిశీలించారు. బంతిని మెరిపించేందుకు ఆటగాళ్లు (ఈస్ట్ జోన్) అతిగా చెమటను ఉపయోగించవద్దని సూచించారు. నిబంధనల ప్రకారం బంతి స్వభావాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చడం నిషేధం.
కాగా, ఈస్ట్ జోన్ బౌలర్లు పాత బంతితోనూ రివర్స్ స్వింగ్ రాబట్టి సౌత్ జోన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా షమీ (2-17), ముకేశ్ కుమార్ (2-36) అద్బుతంగా బౌలింగ్ చేసి సౌత్ జోన్ను కష్టాల్లోకి నెట్టారు. వీరి ధాటికి సౌత్ జోన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. సౌత్ జోన్ను కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.


