షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లో జలంధర్ వారియర్స్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం మెహాలీ వేదికగా లూధియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 168 పరుగుల లక్ష్య చేధనలో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆర్యన్ యాదవ్(32) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా జలంధర్ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో ఊదిపడేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లుథియానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
లుథియానా ఇన్నింగ్స్లో మాధవ్ సింగ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 72) టాప్ స్కోరర్గా నిలిచాడు. జలంధర్ బౌలర్లలో ఆర్యన్ యాదవ్ మూడు, రణ్దీప్ సింగ్, గుర్వీందర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
కొనసాగుతున్న ప్రభ్సిమ్రాన్ నిరీక్షణ?
కాగా 26 ఏళ్ల ప్రభ్సిమ్రాన్ సింగ్ గత కొన్నాళ్లగా వైట్బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే వంటి దేశవాళీ టోర్నీలతో ఐపీఎల్ వంటి మెగా లీగ్లో కూడా అతడు దుమ్ములేపుతున్నాడు. ఇండియా-ఎ జట్టు తరపున కూడా తన మార్క్ చూపించాడు. కానీ సీనియర్ జట్టు తరపున మాత్రం అరంగేట్రం చేసే అవకాశం అతడికి లభించడం లేదు.
జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ గైర్హజరీ కారణంగా ప్రబ్సిమ్రాన్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మొత్తం మూడు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం చేశారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్తో సిరీస్కు సంజూ తిరిగి రావడంతో ప్రభ్సిమ్రాన్ను పక్కన పెట్టేశారు.
అయినప్పటికి అతడు ఏ మాత్రం నిరాశ చెందకుండా తన అద్భుత ప్రదర్శనలతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటివరకు ఈ పంజాబ్ టీ20 లీగ్లో కేవలం 4 మ్యాచ్లు ఆడిన ప్రభ్సిమ్రాన్ 401 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు.
చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!


