షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్‌ శర్మ | Dont Want To Bring Shami To Australia Says Rohit Sharma Explains Why | Sakshi
Sakshi News home page

షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్‌ శర్మ

Oct 15 2024 1:10 PM | Updated on Oct 15 2024 1:33 PM

Dont Want To Bring Shami To Australia Says Rohit Sharma Explains Why

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ పునరాగమనంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లే పరిస్థితి లేదని స్పష్టం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ.. చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.

ఈ మెగా టోర్నీ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్‌-2024తో పాటు టీమిండియా కీలక సిరీస్‌లకూ అందుబాటులో లేకుండా పోయాడు. సర్జరీ అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న ఈ ‘బెంగాల్‌’ పేసర్‌ అక్కడే పునరావాసం పొందుతున్నాడు. క్రమక్రమంగా కోలుకుంటూ నెట్స్‌లోనూ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాడు.

షమీ ఆశలపై నీళ్లు!
ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ నాటికి షమీ అందుబాటులోకి వస్తాడని విశ్లేషకులు భావించారు. కానీ కివీస్‌తో మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి కూడా షమీ దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.

అయితే, షమీ మాత్రం వీటిని ఖండించాడు. నిరాధారపూరితంగా వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని.. తాను ఆసీస్‌తో సిరీస్‌ బరిలో ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చాడు. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ షమీ ఆశలపై నీళ్లు చల్లాడు.

షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం
న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి టెస్టులు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రోహిత్‌కు షమీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.

అతడు గాయం తాలూకు బాధతో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మోకాళ్లు ఉబ్బి ఉన్నాయి. పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఎన్సీఏ డాక్టర్లు, ఫిజియోలు ఎప్పుటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. 

ఏదేమైనా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేని షమీని మేము ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లము’’ అని రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. కాగా నవంబరులో భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. 

చదవండి: T20 WC: భారత్‌ అవుట్‌!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్‌ మాజీ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement