జైపూర్: జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ఆదివారం తెలంగాణ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. గ్రూప్–2 బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కర్రా శివాని రజత పతకం సొంతం చేసుకోగా... గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో ఆరుశ్ దాస్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
శివాని 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్ను 1 నిమిషం 01.28 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ధీవశ్రీ కేశవన్ (తమిళనాడు; 1ని:00.23 సెకన్లు) స్వర్ణం, ఇంద్రాణి మీనన్ (కేరళ; 1ని:01.66 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ను ఆరుశ్ 29.44 సెకన్లలో ముగించి మూడో స్థానం సంపాదించాడు. క్రిశివ్ దోషి (మధ్యప్రదేశ్; 28.36 సెకన్లు) స్వర్ణం... శ్లోక్ జాధవ్ (కర్ణాటక; 28.45 సెకన్లు) రజతం దక్కించుకున్నారు.
ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో ఓవరాల్గా శివాని కర్రా మూడు పతకాలు సాధించింది. అంతకుముందు శివాని 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో రజత పతకం... 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని, ఆరుశ్ శిక్షణ తీసుకుంటున్నారు.


