
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ తమ సైనిక చర్యలతో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బకొట్టింది.
పాక్ కూడా సరిహద్దు వెంబడి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాకుండా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్య నగరాల్లో డ్రోన్ దాడికి యత్నించి పాక్ విఫలమైంది. ప్రస్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఎ అధికారి ఒకరు ధ్రవీకరించారు.
"మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుంది. భారత్లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్తో ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారం తీర్చు కుంటామని" మెయిల్లో రాసి ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది.