చతేశ్వర్ పుజారా వ్యాఖ్య
ఎంసీసీలో శాశ్వత సభ్యత్వం
న్యూఢిల్లీ: ఆ్రస్టేలియా పిచ్లపై అసమాన ప్రదర్శన కనబర్చినప్పటికీ... తనకు ఇంగ్లండ్లో ఆడుతున్నప్పుడు రెండో ఇంట్లో ఉన్న భావన కలుగుతుందని టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. టీమిండియా తరఫున 103 మ్యాచ్లాడిన పుజారా... మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో శాశ్వత సభ్యత్వం దక్కించుకున్నాడు. భారత జట్టు తరఫున మూడు పర్యాయాలు ఇంగ్లండ్లో పర్యటించిన పుజారా... కౌంటీ క్రికెట్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
టీమిండియా టెస్టు సిరీస్లు ఆడని సమయంలో ఎక్కువ శాతం కౌంటీల్లోనే ఆడిన చతేశ్వర్... ఇంగ్లండ్పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నాడు. ‘బ్రిటన్లో చాలాకాలం పాటు కౌంటీ క్రికెట్ ఆడాను. ఎక్కువ రోజులు ఆడినప్పుడు మన ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఎంసీసీలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావవిస్తున్నా. ఈ సభ్యత్వం లభించడం చాలా గొప్ప విషయం. ఒక ప్లేయర్గా కెరీర్ మొత్తం కష్టపడి పనిచేసినప్పుడు దానికి తగిన గుర్తింపు లభించినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకమైనది’ అని పుజారా పేర్కొన్నాడు.
లార్డ్స్ ఎంతో ప్రత్యేకం...
ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన పుజారా... టీమిండియా తరఫున ఇక్కడ శతకం నమోదు చేయలేకపోయాడు. అయితే కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ తరఫున ఈ మైదానంలో పుజారా డబుల్ సెంచరీ బాదాడు. ‘కెరీర్ ఆరంభంలో లార్డ్స్లో మ్యాచ్ చూస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది 2011లో ఒకసారి శస్త్రచికిత్స కోసం లండన్కు వచ్చా. అప్పుడు తొలిసారి లార్డ్స్లో అడుగుపెట్టా. ఇదో ప్రత్యేక ప్రదేశంగా అనిపించింది. అలాంటి చోట ఎంసీసీ శాశ్వత సభ్యత్వం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ప్రపంచంలో ఎన్నో మైదానాల్లో మ్యాచ్లు ఆడాను. కానీ లార్డ్స్ మాత్రం వేరు. ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా లార్డ్స్ బాల్కానీకి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్నో ఏళ్లుగా అది అలాగే ఉంది. లార్డ్స్ మైదానంలో లాంగ్ రూమ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కలిగే భావన మాటల్లో చెప్పలేను. మీరు ఏ జట్టు ప్లేయర్ అనేదానితో సంబంధం లేకుండా మీ ప్రదర్శనకు ఇక్కడ ప్రశంసలు దక్కుతాయి. లార్డ్స్ పిచ్ టెస్టు క్రికెటర్లకు అసలైన పరీక్ష పెడుతుంది.
ముందు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి... ఒక్కసారి పిచ్ను అర్థం చేసుకొని ముందుకు సాగితే... ఇక్కడ బ్యాటింగ్ను ఎంతగానో ఆస్వాదించవచ్చు. లార్డ్స్ బోర్డుపై తమ పేరు చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంతో అదనపు ఒత్తిడి సహజం. నా కెరీర్లో ఏదైనా వెలితి ఉండిపోయిందంటే అది లార్డ్స్ బోర్డులో సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో నా పేరు లేకపోవడమే’ అని పుజారా చెప్పుకొచ్చాడు.
ఆ్రస్టేలియాలో బ్యాటింగ్ సులువే...
ఆ్రస్టేలియా పిచ్లపై పరుగులు వరద పారించి రికార్డులు సృష్టించిన పుజారా... ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ మైదానంలో మాత్రమే సెంచరీ చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ బ్యాటింగ్ చేయడాన్ని కూడా ఆస్వాదిస్తా. ఎందుకటే ఒక్కసారి కుదురుకుంటే ఆసీస్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం సులువే. అదే ఇంగ్లండ్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు పరీక్షిస్తుంటాయి. ఇంగ్లండ్ పిచ్లు కాస్త భిన్నమైనవి. వాటిని ముందు అర్థం చేసుకోగలగాలి’ అని పుజారా వివరించాడు. ఇంగ్లండ్లో తాను ఎదుర్కొన్న బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రత్యేకమైన వాళ్లని పుజారా అన్నాడు.


