
ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహణ
చెన్నై: తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్ (టీఎన్టీఏ) అధ్యక్షుడు, భారత మేటి ప్లేయర్ విజయ్ అమృత్రాజ్ కృషి ఫలించింది. మూడేళ్ల తర్వాత చెన్నై ఓపెన్ భారత టెన్నిస్లో పునరాగమనం చేయనుంది. ఈ అక్టోబర్లో టోర్నీ నిర్వహణకు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆమోదం తెలిపింది. అక్టోబర్ 27 నుంచి మెయిన్ డ్రా పోటీలు జరుగుతాయని టీఎన్టీఏ అధ్యక్షుడు విజయ్ అమృత్రాజ్ తెలిపారు. ‘మొత్తానికి మా ప్రయత్నాలు ఫలించాయి. చెన్నైలో మేటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి మార్గం సుగమమైంది.
ఈ టోర్నీని తిరిగి నగరంలో నిర్వహించాలనే మా ప్రయత్నాలకు మొదటి నుంచి వెన్నంటే ఉండి సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీకి కృతజ్ఞతలు’ అని విజయ్ అన్నారు. ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్ ఈ టోర్నీ మ్యాచ్లను ప్రసారం చేస్తుందన్నారు. చెన్నై అభిమానులు, భారత టెన్నిస్ ప్రియులు ఈ ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చివరి సారిగా చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోర్నమెంట్ను 2022లో నిర్వహించారు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా ఫ్రువిత్రొవా సింగిల్స్
చాంపియన్గా నిలిచింది.