
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా అమీతుమీ తెల్చుకోనుంది.
ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ టైటిల్ను అందుకోవాలని ప్రోటీస్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచ క్రికెట్లో చోకర్స్ టీమ్గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా ఈ సారి ఎలాగైనా ఆ ట్యాగ్ను పోగొట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాను ఓడించడం సఫారీలకు అంతసులువు కాదు.
గతంలో ఐసీసీ టోర్నీ నాకౌట్స్ మ్యాచ్లలో ప్రోటీస్ చిత్తు అయింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ తన జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలవనంతవరకు ఛోకర్స్ ట్యాగ్ అలానే ఉంటుందని బౌచర్ అన్నాడు. ఈసారి గెలిచి ఆ ట్యాగ్ను చెరేపేయాలని బౌచర్ ప్రోటీస్కు పిలుపునిచ్చాడు.
"మేము మా తొలి ట్రోఫీ కోసం ఆడుతున్నాము. చాలా మంది మేము డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవమని అనుకుంటున్నారు. కానీ టెస్టు క్రికెట్ పరిస్థితులు వేరు. ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్లో ఏదైనా జరగొచ్చు. చాలా మలుపులు ఉంటాయి. అవునూ మాకు చోకర్స్ అనే ట్యాగ్ ఉంది.
మేము ఐసీసీ ట్రోఫీని గెలుచుకునేవరకు ఆ ట్యాగ్ పోదు. కాబట్టి గెలిచి ఆ ముద్రను పోగుట్టుకోవాలి. కచ్చితంగా మా ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ యువ జట్టుకు ఆ ట్యాగ్ను చెరిపేసే సత్తా ఉందని" బౌచర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా