
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 సీజన్కు మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. తొలి మ్యాచ్లో రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్కు ముందు ఇస్లామాబాద్ యునైటెడ్కు గట్టి తగలింది. ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారీ పీఎస్ఎల్-2025 సీజన్ నుంచి వైదొలిగాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్థానంలో ఇస్లామాబాద్ ఫ్రాంచైజీ కారీని తమ జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాల కారణంగా ఫస్ట్ హాఫ్ సీజన్ దూరంగా ఉండాలని రాస్సీ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కారీతో ఇస్లామాబాద్ యునైటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పుడు కారీ కూడా పీఎస్ఎల్ నుంచి వైదొలిగి ఇస్లామాబాద్కు భారీ షాకిచ్చాడు. ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా డొమాస్టిక్ మ్యాచ్ల షెడ్యూల్ కారణంగా పీఎస్ఎల్ పదో సీజన్ నుంచి కారీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాన్ డెర్ డస్సెన్ మాత్రం త్వరలోనే ఇస్లామాబాద్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ నుంచి కారీతో పాటు చాలా మంది స్టార్ క్రికెటర్లు తప్పకున్నారు. సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఎంపిక కావడంతో పీఎస్ఎల్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్లో ఆడకుండా ఏడాది పాటు నిషేధం విధించింది.
వీరితో పాటు కివీస్ ఆటగాళ్లు మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, బంగ్లాదేశ్ ప్లేయర్లు నహిద్ రాణా, లిట్టన్ దాస్ కూడా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నారు. పీఎస్ఎల్-2025 సీజన్లో మొత్తం 35 మ్యాచ్లు జరగనున్నాయి. మే 18న జరగనున్న ఫైనల్ పోరుతో ఈ ఏడాది సీజన్ ముగియనుంది.