IPL 2025: భారత్‌ను వీడి వెళ్లే యోచనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు..? | Australian Cricketers Plan To Leave IPL 2025 Amid Indo-Pak Tensions Says Report | Sakshi
Sakshi News home page

IPL 2025: భారత్‌ను వీడి వెళ్లే యోచనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు..?

May 9 2025 11:22 AM | Updated on May 9 2025 11:28 AM

Australian Cricketers Plan To Leave IPL 2025 Amid Indo-Pak Tensions Says Report

Photo Courtesy: BCCI

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్‌ కొనసాగింపుపై ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్‌ను విడిచి వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రముఖ ఆస్ట్రేలియా దినపత్రిక సిడ్ని మార్నింగ్‌ హెరాల్డ్‌ ఓ కథనంలో పేర్కొంది. 

భారత్‌లో యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ఆసీస్‌ ఆటగాళ్లు భయాందోళనలకు గురవుతున్నట్లు ఆటగాళ్ల ఏజెంట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సందేశం చేరవేశారట. ముఖ్యంగా భారత్‌, పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆసీస్‌ ప్లేయర్లు బిక్కుబిక్కుమంటున్నట్లు సిడ్ని మార్నింగ్‌ హెరాల్డ్‌ పేర్కొంది. వీలైనంత త్వరగా తమను భారత్‌ నుంచి దాటించాలని కొందరు ఆసీస్‌ ప్లేయర్లు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు విన్నవించుకున్నారట.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన పాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, జోస్‌ ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, ఆరోన్‌ హార్డీ, నాథన్‌ ఇల్లిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు. వీరితో పాటు రికీ పాంటింగ్‌, బ్రాడ్‌ హడిన్‌, మైక్‌ హస్సీ వంటి వారు వేర్వేరు జట్ల తరఫున కోచింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా, నిన్న (మే 8) ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్‌, ఢిల్లీ మ్యాచ్‌ బ్లాక్‌ అవుట్‌ కారణంగా రద్దైంది. తొలుత ఫ్లడ్‌ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశామని ప్రకటించిన ఐపీఎల్‌ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించారు. పాక్‌ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్‌ చీఫ్‌ అరుణ్‌ ధుమాల్‌ ప్రకటించాడు. మ్యాచ్‌ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్‌ ద్వారా పఠన్‌కోట్‌ గుండా ఢిల్లీకి తరలించారు.

బ్లాక్‌ అవుట్‌ అంటే యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. 

నేటి ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌ జరుగుతుందా..?
ధర్మశాలలో నిన్న జరగాల్సిన మ్యాచ్‌ రద్దయ్యాక ఐపీఎల్‌ 2025 కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే నిన్న ఈ విషయంపై ఐపీఎల్‌ చీఫ్‌ అరుణ్‌ ధుమాల్‌ స్పందిస్తూ.. ఇవాళ (మే 9) జరగాల్సిన ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌ యధాతథంగా కొనసాగుతుందన్నట్లు చెప్పాడు. నేటి మ్యాచ్‌లో ఎలాంటి అపాయమూ లేని లక్నోలో జరుగనుండటమే అప్పుడు ధుమాల్‌ చేసిన ప్రకటనకు కారణం కావచ్చు. అయితే దీనిపై తుది నిర్ణయం మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement