వివాదం ఇంకా ఉంది! | Another twist in the I League controversy | Sakshi
Sakshi News home page

వివాదం ఇంకా ఉంది!

Apr 28 2025 3:56 AM | Updated on Apr 28 2025 3:57 AM

Another twist in the I League controversy

ఐ–లీగ్‌ వివాదంలో మరో మలుపు

చర్చిల్‌ బ్రదర్స్‌ను విజేతగా ప్రకటించవద్దని సీఏఎస్‌ స్టే

ఆదివారమే పతకాలు, ట్రోఫీలు కూడా అందజేసిన ఏఐఎఫ్‌ఎఫ్‌

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ ఐ–లీగ్‌ చాంపియన్‌షిప్‌లో చర్చిల్‌ బ్రదర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ను విజేతగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రకటించడంపై అంతర్జాతీయ స్పోర్ట్స్‌ అర్బిట్రేషన్‌ కోర్టు (సీఏఎస్‌) స్టే విధించింది. కేసులో విచారణ ముగిసేవరకు టైటిల్‌ చాంప్‌పై ఓ నిర్ణయానికి రావొద్దని సీఏఎస్‌ డివిజన్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌ మధ్యంతర తీర్పు ఇచ్చారు. ఈ సీజన్‌ ఐ–లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంటర్‌ కాశీ జట్టు తమకు సంబంధించిన ఒక మ్యాచ్‌ ఫలితంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుండానే ఏఐఎఫ్‌ఎఫ్‌ ఏకపక్షంగా చర్చిల్‌ బ్రదర్స్‌ జట్టును విజేతగా ప్రకటించడం అసంబద్ధమని కోర్టుకెక్కింది. 

దీనిపై ఆదివారం విచారించిన సీఏఎస్‌ డివిజన్‌ ఏఐఎఫ్‌ఎఫ్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. జట్టు సభ్యులకు పతకాలు గానీ, ట్రోఫీని గానీ బహూకరించరాదని స్పష్టం చేసింది. ప్రతివాదులైన విజేత జట్టు చర్చిల్‌ బ్రదర్స్‌ యాజమాన్యం, ఏఐఎఫ్‌ఎఫ్‌లకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువిచ్చింది. కానీ జరగాల్సిన తంతు ఆదివారమే జరిగిపోవడంతో ఇప్పుడు ఏఐఎఫ్‌ఎఫ్‌ నవ్వులపాలైంది. 

వివాదం ఉన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోని ఏఐఎఫ్‌ఎఫ్‌ అత్యుత్సాహానికి పోయి ఆదివారం విజేత జట్టుకు ట్రోఫీని, పతకాలను బహూకరించింది. అయితే తుదితీర్పుకు లోబడే తమ నిర్ణయముంటుందని, అప్పుడు ట్రోఫీని, పతకాలను వెనక్కి తీసుకుంటామని ముక్తాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. 

ఏమిటీ వివాదం! 
ఐ–లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో నాకౌట్‌ పోటీలు, ఫైనల్‌ మ్యాచ్‌ అనేవి ఉండవు. మొత్తం పాల్గొన్న జట్లలో సాధించిన విజయాలు, కొట్టిన గోల్స్, ఇచ్చిన గోల్స్‌ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో 40 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చర్చిల్‌ బ్రదర్స్‌ను ఏఐఎఫ్‌ఎఫ్‌ విజేతగా ప్రకటించింది. కానీ 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంటర్‌ కాశీ జట్టుకు అంతకుముందు నాంధారి జట్టుతో జరిగిన మ్యాచ్‌ ఫలితం వివాదం రేపింది. 

ఈ మ్యాచ్‌లో ఇంటర్‌ కాశీ జట్టు 2–0తో నాంధారి జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అనర్హతకు గురైన ఆటగాడితో మ్యాచ్‌ ఆడించినందు వల్ల నాంధారి జట్టుపై పెనాల్టీ విధించి ఫలితాన్ని తమకు అనుకూలంగా ఇవ్వాలని ఇంటర్‌ కాశీ కోరింది. ఒకవేళ తీర్పు ఇంటర్‌ కాశీ జట్టుకు అనుకూలంగా వస్తే ఆ జట్టు 42 పాయింట్లతో ఐ–లీగ్‌ చాంపియన్‌గా అవతరిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement