పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్‌.. కోహ్లి, ధోనికి ఆహ్వానం లేదు! | Akash Deep Married Akshita Raj Reveals Why Didn't Invite Dhoni, Kohli, Rohit | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్‌.. కోహ్లి, ధోనికి ఆహ్వానం లేదు!

Jun 25 2026 11:25 AM | Updated on Jun 25 2026 11:43 AM

Akash Deep Married Akshita Raj Reveals Why Didn't Invite Dhoni, Kohli, Rohit

టీమిండియా పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఓ ఇంటివాడయ్యాడు. అక్షిత రాజ్‌తో కలిసి మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాడు. వారణాసిలో బుధవారం వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆకాశ్‌ దీప్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశాడు.

శాశ్వత ఇన్నింగ్స్‌
ఇందుకు.. ‘‘ఈ అందమైన పెళ్లి వేడుక.. ఇద్దరు దిగ్గజాలు తమ శాశ్వత ఇన్నింగ్స్‌ మొదలుపెట్టే ఘట్టాన్ని అందంగా చిత్రీకరిస్తున్నట్లుగా ఉంది. రీటేక్‌లు ఏమీ లేవు. నమ్మకం, టీమ్‌ స్పిరిట్‌తో మేము ముందుకు సాగుతున్నాం’’ అని ఆకాశ్‌ దీప్‌ క్యాప్షన్‌ జత చేశాడు.

శుభాకాంక్షల వెల్లువ
ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి ఆకాశ్‌ దీప్‌- అక్షితా రాజ్‌ (India pacer Akash Deep Wedding)కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా నవదంపతులను విష్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. ఆకాశ్‌ దీప్‌ స్నేహితులు షేర్‌ చేసిన ఓ వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో.. ‘‘నీ పెళ్లికి భారత క్రికెట్‌ దిగ్గజాలు మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను ఎందుకు పిలవలేదు’’ అని ఓ వ్యక్తి అడిగాడు.

అందుకు వాళ్లను పిలవలేదు!
ఇందుకు బదులుగా ఆకాశ్‌ దీప్‌.. ‘‘పెళ్లి బనారస్‌ (వారణాసి)లో జరుగుతుంది కదా!’’ అని అనడంతో నవ్వులు పూశాయి. కాగా కోహ్లి, ధోని, రోహిత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ముఖ్యంగా కోహ్లి కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎగబడతారో తెలిసిందే. అందుకే తన పెళ్లి సజావుగా సాగాలంటే కోహ్లి భయ్యా ఇక్కడ లేకపోవడమే మంచిది అన్నట్లు ఆకాశ్‌ దీప్‌ సరదాగా ఇలా బదులిచ్చాడు.

కాగా బిహార్‌కు చెందిన ఆకాశ్‌ దీప్‌.. 2024లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌ ద్వారా ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 

ఇప్పటికి ఈ 29 ఏళ్ల పేస్‌ బౌలర్‌ టీమిండియా తరఫున 10 టెస్టులు ఆడి.. 28 వికెట్లు కూల్చాడు. గతేడాది ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ గడ్డ మీద ఆకాశ్‌ దీప్‌ సత్తా చాటాడు. బర్మింగ్‌హామ్‌ టెస్టులో పన్నెండు వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు.

ఇక ఇప్పటికి ఐపీఎల్‌లో పద్నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్‌ దీప్‌.. పది వికెట్లు తీయగలిగాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని సొంతం చేసుకోగా.. గాయం కారణంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.అదే విధంగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. తాజాగా పెళ్లి బంధంలో అడుగుపెట్టి వ్యక్తిగత జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు.

చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు..  భారత్‌ బ్యాటింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement