
జూన్ 6 నుంచి శ్రీలంకలో జరగాల్సిన మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2025 వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం మరియు ఆరోగ్య పరిస్థితులు కారణంగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం (జూన్ 2) ప్రకటించింది. టోర్నీని వాయిదా వేయాలని ఆతిథ్య బోర్డు (శ్రీలంక) అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఏసీసీకి లేఖ రాశాడు. ఈ లేఖను పరిగణలోకి తీసుకొని ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని, ఆ ప్రాంతంలో చికున్గున్యా వ్యాప్తి చెందుతుందని సిల్వా తన లేఖలో పేర్కొన్నాడు. టోర్నీ తదుపరి షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ వెల్లడించాడు.
కాగా, ఏసీసీ మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో తొలిసారి జరిగింది. హాంగ్కాంగ్ వేదికగా నాడు జరిగిన టోర్నీలో భారత్ ఏ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ ఏను 31 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు యూఏఈ, నేపాల్, థాయ్లాండ్, మలేసియా జట్లు పాల్గొంటాయి.