సంగారెడ్డి: ద్వేషం, కులతత్వంతో బీజేపీ దేశాన్ని విభజిస్తోందని, ఆ ప్రయత్నాలను ఐక్యంగా తిప్పి కొడదామని ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఘటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించారు. ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పట్ల బీజేపీ, దాని అనుబంధ సంస్థలు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఐబీ నుంచి బాబు జగ్జివన్రామ్ విగ్రహం వరకు సోమవారం కాంగ్రెస్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా దీపక్ రాథోర్ మాట్లాడుతూ... ఖర్గే ప్రసంగించిన వేదికపై ‘శుద్ధీకరణ’పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు గంగాజలాన్ని చల్లడం అత్యంత జుగుప్సాకరమన్నారు. దేశ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించాల్సిన సమయంలో మళ్లీ మనుస్మృతి, కులతత్వం వైపు దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇలా చేయడం భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వ స్ఫూర్తిని అవమానించడమేనని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విద్యార్థులు, యువత, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఫాసిస్టు శక్తులు భారతదేశాన్ని ఎంతగా విభజించేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి సైనికుడు, ప్రతి సాధారణ కార్యకర్త దేశ ఐక్యత, సమగ్రత కోసం చివరి వరకు పోరాడతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోర్,
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా


