శివ్వంపేట(నర్సాపూర్): పదమూడేళ్ల క్రితం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమిని అక్రమార్కులు భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని బాఽధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన చుక్క రాణి, శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ.. తాము 2013లో దొంతి గ్రామ పరిధి సర్వే నం.433లో 23 గుంటల భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూమిని పలువురు ఆక్రమించుకునేందుకు తమపై దాడులకు పాల్పడ్డారని దీంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. సదరు భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితం తమకు చెందిన భూమిలో కిరాయి రౌడీలను తీసుకువచ్చి పెన్సింగ్ కడీలను తొలగించారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.


