యాగంలో పాల్గొన్న 7,450 మంది దంపతులు
న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రాఘవాపూర్–హుమ్నాపూర్ గ్రామ శివారులో గల పంచవటి క్షేత్రంలో పుష్కరకాల చండీరుద్ర మహాయాగం కొనసాగుతోంది. లోక కల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పంచవటి క్షేత్రం పీఠాధిపతి శ్రీ కాశీనాథ్ బాబా పుష్కరకాల శత చండీరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టారు. 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా యాగాన్ని నిర్వహించడం వల్ల అంతా శుభమే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయని అందుకే యాగాన్ని నిర్వహించేంందుకు శ్రీకారం చుట్టానని బాబా తెలిపారు. లోక కల్యాణార్థం 8 ఏప్రిల్ 2016లో యాగాన్ని పంచవటి క్షేత్రంలో ఆయన ప్రారంభించారు. యాగం ప్రారంభమై శనివారానికి 10 ఏళ్ల, 4నెలల, 19 రోజులు పూర్తయ్యాయి. మహాయాగం 2028లో పూర్తి కానుంది. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం క్షేత్ర ఆవరణలో నిర్వహించే యాగంలో ఇద్దరు చొప్పున దంపతులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 7,450 మంది దంపతులు యాగంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.


