● యువకుడి మృతి
● మరో ఇద్దరికి గాయాలు
నర్సాపూర్ రూరల్: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వద్ద చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన మల్పర్తి హర్షవర్ధన్(19)తో పాటు బోడ అఖిల్ బాబు, ఎండి ఇర్ఫాన్ ముగ్గురు కలిసి బోనాల సందర్భంగా శివాలయం వద్ద ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు హర్షవర్ధన్ కరెంట్ షాక్కు గురయ్యాడు. అతనితో పాటు ఉన్న బోడ అఖిల్ బాబు, ఎండి ఇర్ఫాన్ హర్షవర్ధన్ను కాపాడే ప్రయత్నంలో షాక్కు గురై గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి హర్షవర్ధన్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అఖిల్ బాబు, ఇర్ఫాన్ను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతునికి తల్లిదండ్రులతో పాటు అన్న, తమ్ముడు ఉన్నారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గడ్డి కట్ చేస్తుండగా కూలీ..
కౌడిపల్లి(నర్సాపూర్): పొలం గట్లపై గడ్డి కట్ చేస్తుండగా కూలీ కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని లింగంపల్లి పంచాయతీ ముడేరితండాలో చోటుచేసుకుంది. ఎస్ఐ అమరేందర్రెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన ముడావత్ సంతోష్(25) తండాకు చెందిన పరంలాల్ పొలంలో గడ్డి కట్ చేసేందుకు కూలీకి వెళ్లాడు. బు్ష్ కట్టర్తో బోర్ బావి పక్కన వరంపై గడ్డి కట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బోర్ కేబుల్వైర్ను గమనించకపోవడంతో బుష్ కట్టర్కు వైర్ తగిలి కరెంట్షాక్ వచ్చి సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా అన్న వదినల వద్ద ఉంటూ కూలీపనులు చేస్తున్నాడు. దీంతో తండాలో విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమి త్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


