హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండల కేంద్రంలో రెండు రోజులుగా నెట్వర్క్ అంతరాయం ఏర్పడటంతో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో నెట్వర్క్ సమస్య తలెత్తడంతో ఎయిర్టెల్ నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో ఇంటర్నెట్ సమస్యలేర్పడి రిజిస్ట్రేషన్లు ఇతర పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో నెట్వర్క్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.
జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్
కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ స్పష్టం చేశారు. కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలల గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కౌడిపల్లిలోని బాలురు, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలతోపాటు ఎస్టీ బాలుర, బాలికల మినీ గురుకులం, బతుకమ్మ తండాలో పాఠశాలతోపాటు హాస్టల్లో మంచినీరు, గ్రౌండ్, విద్యుత్, ఫ్యాన్లు ఇతర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బతుకమ్మతండాలో ప్రహారీగోడ నిర్మాణం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో హెచ్ఎంలు లలితాదేవి, సాజిత్అలీ, ఫణికుమార్, పంచాయతీ కార్యదర్శి నగేశ్, ఎల్లం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందజేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిని మంగళవారం రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాడల్ స్కూల్ విద్యార్థులు పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్గార్ రజని, ఆర్ఐలు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ వరద ఉధృతిని అదనపు కలెక్టర్ నగేశ్ మంగళవారం పరిశీలించారు. అనంతరం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున పోలీసు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోచమ్మరాళ్ శివారులో గతేడాది కొట్టుకుపోగా, తాత్కాలికంగా నిర్మించిన రోడ్డును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


