నారాయణఖేడ్: కురుస్తోన్న వర్షాలతో నిజాంపేట్ మండలంలోని మొదళ్లకుంట తండా కొత్తకుంట చెరువుకులోకి భారీగా వరదనీరు చేరడంతో చెరువుకు గండి పడింది. గండి పడటం కారణంగా చెరువులోని నీరు ఎప్పుడైనా తండాలోకి చేరే ప్రమాదముందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది చెరువుకు గండి పడే ప్రమాదముందని గుర్తించి తాత్కాలికంగా ఒకవైపు మట్టిని తొలగించి నీటిని మళ్లించారని గిరిజనులు తెలిపారు. అనంతరం వేసవిలో నీటిపారుదల శాఖ అధికారులు చెరువును పరిశీలించినప్పటికీ గండిని శాశ్వతంగా పూడ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వరదనీరు ఒక్కసారిగా చెరువులోకి చేరి గండి మరింత విస్తరించిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వరదనీరు తండాలోకి ప్రవేశించి గృహాలతోపాటు పంట భూముల్లోకి నీరు చేరి భారీ నష్టం వాటిల్లే అవకాశముందని తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. చెరువు గండికి నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారని, పూర్తిస్థాయిలోనే మరమ్మతులు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని గిరిజనులు కోరుతున్నారు.


